గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు..సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తారకరత్న ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
”సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుంచి అతడిని కాపాడిన డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. నువ్వు దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను డియర్ తారకరత్న” అంటూ ట్వీట్ చేశారు చిరు.
అయితే తారకరత్న ఆరోగ్యం నిన్న,మొన్నటితో పోలిస్తే కాస్త మెరుగుపడిందని రామకృష్ణ తెలిపారు. అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయని చెప్పారు. అయితే ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారన్నారు. తారకరత్నకు ఎక్మో పెట్టారన్న వార్తలపై రామకృష్ణ స్పందించారు. ఎక్మో పెట్టలేదని..అవన్నీ అవాస్తవాలేనని రామకృష్ణ కొట్టిపారేశారు. రామకృష్ణ చెప్పిన ఈ ఒక్క మాట నందమూరి, నారా ఫ్యామిలీ, అభిమానులు, టీడీపీ కార్యకర్తలకు కాస్త ఉపశమనం కలిగించింది. సీటీ స్కాన్ రిపోర్ట్ వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందని రామకృష్ణ చెప్పారు.
ఐసీయూలో న్యూరాలజిస్టుల పర్యవేక్షణ మధ్య తారకరత్న వైద్యం తీసుకుంటున్నారు. సోమవారం తారకరత్నకు సిటీ స్కాన్ చేశారు వైద్యులు. ఈ రిపోర్టులో ఏం వస్తుందనే దానిపైనా కుటుంబ సభ్యుల్లో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారాయణ హృదయాలయ ఆస్పత్రిలోనే ఉంటూ వైద్యులను అడిగి ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాల పాటు మెదడు పని తీరుపై ప్రభావం పడినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరు న్యూరో సర్జన్లు సహా 10 మంది వైద్యులు తారకరత్న ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నారు.