ఎన్డీయే వైఫల్యాలను ఎత్తి చూపేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని బీఆర్ఎస్ పార్టీ తెలియజేసింది. రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన ఉంటుందన్నారు. కేంద్ర ప్రజావ్యతిరేక నిర్ణయాలు పార్లమెంట్ లో ఎండగడతామన్నారు. అఖిలపక్ష సమావేశంలోనూ మా వైఖరి స్పష్టంగా చెప్పాం అని కేకే పేర్కొన్నారు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం పై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.
అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తామని కేకే స్పష్టం చేశారు. పార్లమెంట్ ఉభయ సభ్యులను ఉద్దేశించి, రాష్ట్రపతి సెంట్రల్ హాల్ లో ప్రసంగించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్,ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు కలిసివచ్చే పార్టీలతో సమిష్టి వ్యూహాన్ని అనుసరించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో నిన్న జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే..లోక్ సభాపక్ష నేత నామానాగేశ్వర్ రావు హాజరయ్యారు. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాలలో గవర్నర్ల తీరుపై పార్లమెంట్ లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.