ఇటీవల హైదరాబాద్ లో తల్లిని చంపిన దత్తపుత్రుడు.. తన స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 7న దిల్సుఖ్నగర్ లో భూలక్ష్మి(52) అనే మహిళ హత్యకు గురైంది. తల్లి భూదేవిని దత్త పుత్రుడు సాయితేజ తన ఫ్రెండ్ శివతో కలిసి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న రూ. 10 లక్షల నగదు, 35 తులాల బంగారం తీసుకొని పరారీ అయ్యారు.
సీన్ కట్ చేస్తే.. నల్లమల్ల అడవుల్లోని మల్లెలతీర్థం వద్ద ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అది సాయితేజ డెడ్ బాడీగా గుర్తించారు.
సాయితేజను బండరాయితో మోది హత్య చేసిన అనంతరం డెడ్ బాడీని మల్లెలతీర్థం నీటి గుండంలో పడేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. తన తల్లి హత్యలో సహాయపడిన తన స్నేహితుడు శివనే.. సాయితేజను చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ కేసులో భాగంగా శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు వెల్లడించారు. శ్రీశైలంకు వెళ్లి వస్తూ.. మల్లెలతీర్థం వద్ద సాయితేజ, శివ ఇద్దరూ మద్యం సేవించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో సాయితేజను శివ హత్య చేసినట్టు ప్రాధమిక విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు.