జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ.. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం 6నెలల్లో పూర్తిచేయాలని సూచించింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొంది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
భూములు ఇచ్చిన రైతులకు 3నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని తీర్పునిచ్చింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికిి భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
సీఆర్డీఏ చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని ఆదేశించింది. రాజధాని అవసరాలకే భూమిని వినియోగించాలని చెప్పింది. రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని హైకోర్టు తీర్పు ను వెలువరించింది.