– తలనొప్పిగా జిల్లా అధ్యక్షుల నియామకం
– కేసీఆర్ కు ముందు నుయ్యి..వెనుక గొయ్యి
– పార్టీలో తీవ్రమవుతున్నఅసంతృప్తి
– గులాబీ పార్టీలో ఉంటే..ఏమీ మిగలదనే టెన్షన్
– బీజేపీ,కాంగ్రెస్ చీఫ్ ల టచ్ లోకి వెళ్తున్న గులాబీలు
టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించాలి కాబట్టి నియమించినట్లు వుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కెసిఆర్ కు మొదటి నుండి జిల్లాల పార్టీ నిర్మాణం పై పెద్దగా ఆసక్తి లేదు. ఎవరెవరినో జిల్లా నాయకులుగా ఫోకస్ చేస్తే వారు రేపటి రోజున తమ పదవిని అడ్డం పెట్టుకొని ఇతర పార్టీలతో బేరసారాలు జరిపి పార్టీ ఫిరాయిస్తారు అనే భయం కెసిఆర్ ను వెంటాడుతూ వుంటుంది.అదేంటి అని ఎవరైనా అడిగితే..మన పార్టీ నిర్మాణం బీఎస్పీతరహాలో వుండాలి అని నాయకులకు ఎప్పుడూ హితబోధ చేస్తుంటారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.తాజాగా పూర్తి స్థాయిలో అన్నిజిల్లాలకు అధ్యక్షులను నియమించారు.ఎక్కువ జిల్లాలకు ఎమ్ఎల్ ఏ..ఎంపి..ఎమ్ఎల్ సి లనే జిల్లా అధ్యక్షులు గా నియమించారు అని గుర్తు చేస్తూ దీని వెనకాల కెసిఆర్ వ్యూహం ఏమై ఉంటుంది అనే విశ్లేషణ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం దాటి బయటకు వెళ్ళలేరు.
ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. వారు వారి వారి నియోజకవర్గాలను చక్కదిద్దుకోవడానికే సమయం సరిపోదు అలాంటిది పక్క నియోజకవర్గానికి వెళ్ళి అక్కడి సమస్యలను చక్కదిద్దే సమయం వుండదు. పైగా తన నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చి వేలు పెడతాను అంటే అంగీకరించే పరిస్థితి అసలే వుండదు అని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాలు కేసిఆర్ కి తెలియక కాదు అని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. కావాలనే వ్యూహాత్మకంగా ఎమ్మెల్యేలనను జిల్లా అధ్యక్షులు గా నియమించారనేది వారి విశ్లేషణ. ఎందుకంటే ఎవరి నియోజకవర్గానికి వారు పరిమితమైతే చాలు, జిల్లా అధ్యక్షులు గా మీరు చేయాల్సింది ఏమి లేదు. అంతా నేను చూసుకుంటాను అని పరోక్షంగా వారికి చెప్పడమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎంపీల పరిస్థితి కూడా అంతే రేపటి రోజు వారు మళ్ళీ గెలవాలంటే ఎమ్మెల్యేలతో సఖ్యతగా వుండాలి. లేదంటే గెలవడం కష్టం కనుక జిల్లా అధ్యక్షులుగా వున్న ఎంపీలు ఎక్కువ తక్కువ జిల్లాలో తిరిగి హడావిడి చెయ్యరు. కేసిఆర్ కోరుకునేది కూడా ఇదే. జిల్లా అధ్యక్షులు వుండాలి..అలాగని వారు యాక్టివ్ గా జిల్లాలో చక్కర్లు కొట్టకూడదు. ఇదే గులాబీ బాస్ వ్యూహం. కొన్నిచోట్ల ఎమ్మెల్సీలను కుడా జిల్లా అధ్యక్షులు గా నియమించారు. ఎవరిని నియమించినా వాళ్లు చేసేదేం లేదు. ఖాళీగా వున్ననాయకుడికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే .. జిల్లా అంతా తిరిగి అనవసరమైన హడావిడి చేసి సమస్యలు సృష్టిస్తారు అనే భయం తోపాటు భవిష్యత్ లో ..ఎమ్మెల్యే టికెట్ కావాలని వత్తిడి కూడా తెస్తారు. ఇవ్వకపోతే వేరే పార్టీలోకి ఫిరాయిస్తారు అనే భయం కూడా టీఆర్ఎస్ అధినేతకు వుంది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఇదంతా వినటానికి బాగానే ఉంది. కానీ ఇక్కడా కొన్ని చిక్కుముడులున్నాయి. పదవులు ఉన్నవారికే మళ్ళీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వడం పై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు అనేది గట్టి టాక్. మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు..కనీసం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అయినా ఇస్తారు అనుకున్నాం, ఇంత అన్యాయమా అని ఇప్పటికే గుసగుసలు ..రుసరుసలు పార్టీ శ్రేణుల్లో మొదలైపోయాయిట. ఇంకా ఈ పార్టిలోనే ఉంటే…చెవిలో గులాబీ తప్ప మనకి ఏమీ మిగలదు అనే జ్ఞానోదయం కూడా కొంతమందికి అయిందట. అలాంటివారిలో కొందరు ఇప్పటికే మన దారి మనం చూసుకుంటే మంచిది అని ఫీలవుతున్నారట. బహుశా ఇలాంటి వాళ్ల గురించేనేమో.. అటు కమలనాథులు, ఇటు పీసీసీ చీఫ్ టచ్ లో ఉన్నారు..అని పదే పదే చెప్పేది అనేది విశ్లేషకుల భావన. మొత్తానికి జిల్లా అధ్యక్షుల నియామకం… ప్రజాస్వామిక టీఆర్ఎస్ పార్టీకి.. గులాబీ బాస్ కి చాలా కష్టం తెచ్చిపెట్టిందని రాజకీయ పండితులు అనుకుంటున్నారు.