ఐపీఎల్ సమరానికి రెడీ అవుతున్న బీసీసీఐ మెగావేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల తుది జాబితాను మంగళవారం విడుదల చేసింది. మొత్తం 590 మంది పేర్లున్న ఈ జాబితాలో 370 మంది ఇండియన్ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈనెల 12, 13వ తేదీల్లో బెంగళూరులో వేలం జరగనుంది. అయితే.. మొత్తం ఆటగాళ్లలో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. 355 మంది అన్ క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఏడుగురు ఉన్నారు.
శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధవన్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, సురేశ్ రైనా, యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ తదితరుల కోసం తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్టి బీసీసీఐ తెలిపింది.
ఈ సారి మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆడనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, టీమ్ అహ్మదాబాద్ వేలంలో పాల్గొననున్నట్టు తెలిపారు.
ఈ వేలంలో పాల్గొంటున్న వారిలో నాగాలాండ్ లెగ్ స్పిన్నర్ ఖ్రీవిట్సో కెన్సే అత్యంత పిన్న వయస్కుడిగా బీసీసీఐ పేర్కొంది. అతని వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. మరోవైపు అత్యంత పెద్ద వయస్కుడిగా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఉన్నాడు. మిశ్రా వయసు 39 సంవత్సరాలు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న మూడో బౌలర్ కూడా మిశ్రానే కావడం విశేషం. ఐపీఎల్ లో ఇప్పటి వరకు మొత్తం 166 వికెట్లు సాధించాడు మిశ్రా.