ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో మృతి చెందిన భారతీయ విద్యార్థి నవీన్ మృతదేహం 20 రోజుల తర్వాత సోమవారం బెంగళూరుకు చేరుకోనుంది. అయితే.. మొదట ఆదివారం చేరుతుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత దానిని సరిచేశారు. నవీన్ శేఖరప్ప మృతదేహం సోమవారం బెంగళూరు విమానాశ్రయానికి ఉదయం 3 గంటలకు చేరుకుంటుందని..అతని కుటుంబసభ్యులకు తెలియజేసినట్లు వెల్లడించారు.
ఉక్రెయిన్ నగరం ఖర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో చివరి సంవత్సరం చదువుతున్న నవీన్.. మార్చి 1న రష్యా దాడిలో మరణించాడు. అయితే.. ఆ తర్వాత తన కొడుకు మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరడంతో.. ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. నవీన్ తండ్రి కూడా.. తన కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా ప్రధాని మోడీని, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించారు.
దాదాపు 19 రోజుల నుంచి నవీన్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో నవీన్ మృతదేహం తరలింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి.
వైద్య విద్యార్థి నవీన్ జ్ఞానగౌడర్ మార్చి 1న యుద్ధం జరుగుతున్న సమయంలో ఖర్కీవ్లోని తాను ఉన్న ప్రాంతంలో నిత్యావసరసరుకులకు వెళ్తుండగా.. రష్యా దాడిలో మరణించాడు. అయితే.. నవీన్ మృతదేహాన్ని దేవనాగరిలోని ఎస్ఎస్ మెడికల్ కాలేజీకి దానం చేయాలని అతడి కుటుంబం నిర్ణయించింది. తన కొడుకు మృతదేహం ఆలస్యంగా రావడం బాధాకరమని నవీన్ తండ్రి శేఖర్ గౌడ ఆవేదన వ్వక్తం చేశారు.