కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి మరో నాలుగు జాతీయ రహదారులను మంజూరు చేస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో ఒక దాన్ని నాలుగేళ్ల కిందట ఎంపిక చేయగా.. మిగతా మూడింటిని గతేడాది జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది కేంద్రం.
తాజాగా వాటి పనులు ప్రారంభించేందుకు అనుమతులను ఇచ్చింది. వీటికి టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది.
అవసరమైన చోట్ల నాలుగు వరుసలుగా.. మిగతా ప్రాంతాల్లో 10 మీట్లర్ల వెడల్పుతో రోడ్లను మార్చనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. అంటే.. 248.5 కిలో మీటర్ల పొడువు.. 10 మీటర్ల వెడల్పుతో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీని కోసం ఏకంగా రూ.2,431 కోట్లు ఖర్చు చేయనుంది కేంద్ర రవాణా శాఖ.
ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని కేంద్ర రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. రాష్ట్రంపైన కేంద్రం చిన్న చూపు చూపుతోందని ఆరోపించే తెలంగాణ నాయకులకు ఇది చెంపదెబ్బగా మారిందని పలువురు చెప్పుకుంటున్నారు.