పెళ్లంటే ఏ గుడిలోనో, ఫంక్షన్ హాల్లోనో, హోటల్లోనో, లేదంటే ఇంటి దగ్గరో జరుగుతుంది. కానీ, ఈ పెళ్లి మాత్రం ఆసుపత్రిలో జరిగింది. వధువు ఆసుపత్రిలో బెడ్పై ఉంటే, వరుడు ఆమె మెడలో తాళి కట్టాడు. ఈ ఘటన, మంచిర్యాల జిల్లాలో గురువారం జరిగింది.చెన్నూర్ మండలం, లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి గురువారం పెళ్లి జరగాల్సి ఉంది.
అయితే, పెళ్లికి ఒక రోజు ముందు.. బుధవారం పెళ్లి కూతురు అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెకు అత్యవసర చికిత్స అవసరమైంది. పెళ్లి రోజైన గురువారం కూడా నవ వధువు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆస్పత్రి నుంచి వధువు బయటకు రాలేని పరిస్థితి. అయినప్పటికీ ఇరువురి కుటుంబ సభ్యులు ఎలాగైనా పెళ్లి చేయాలనుకున్నారు.
వరుడు కూడా పెళ్లి చేసుకునేందుకే సిద్ధపడ్డాడు. దీంతో వరుడితోపాటు ఇరు కుటుంబాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. ఆస్పత్రి యాజమాన్యం అనుమతి తీసుకుని, అక్కడే పెళ్లి జరిపించేందుకు నిర్ణయించారు. దీంతో ఆస్పత్రి బెడ్పై చికిత్స పొందుతున్న వధువుకు, వరుడు అక్కడే తాళి కట్టాడు. అనంతరం నవ దంపతులు దండలు మార్చుకుని, స్వీట్లు పంచుకున్నారు. వివాహ తంతును ఆస్పత్రిలోనే నిర్వహించుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి వాయిదా పడకూడదనుకుని ఆస్పత్రిలోనే పెళ్లికి అంగీకరించిన వరుడి తీరును అందరూ అభినందిస్తున్నారు. కొత్త జంటను ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.