తెలంగాణ రాష్ట్రంలో రేడియంట్ కంపెనీ నుంచి 50 లక్షల టీవీలు తయారవ్వడం గర్వంగా ఉందన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ర్టానిక్స్ యూనిట్లో మరో నూతన ప్లాంట్ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కలిసి సోమవారం ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు.
దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ కంపెనీ ఇది అని పేర్కొన్నారు కేటీఆర్. రేడియంట్ కంపెనీలో 3,800ల మందికి పైగా పని చేస్తున్నారని తెలిపారు. యూనిట్ ప్రారంభంలో సంవత్సరానికి 4 లక్షల టీవీలు తయారు చేయాలనుకుంటే.. ఇప్పుడు నెలకు 4 లక్షల టీవీలు తయారు చేసే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగుల్లో 53 శాతం మహిళలు ఉండగా.. 60 శాతం మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన శ్యాంసంగ్, వన్ ప్లస్, పానసోనిక్, అమెజాన్ స్కైవర్త్, నోకియా, మోటోరోలా లాంటి వాటిని ఈ కంపెనీ తయారు చేస్తుందని చెప్పారు. తమ కంపెనీ ఆదాయం 35 రెట్లు పెరిగిందని కంపెనీ యాజమాన్యం తెలిపిందన్నారు. గత కొన్నేండ్ల నుంచి కరెంట్ కోతలు లేవని.. కేసీఆర్ నాయకత్వంలో కరెంట్ కోతలను అధిగమించామన్నారు. పరిశ్రమలకే కాకుండా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ చదువుకున్న పిల్లలను ఉద్యోగులుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని వివరించారు. దీన్ని మరింత విస్తరిస్తే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఫ్యాబ్ సిటీలో 15 వేల మంది ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతాయని వెల్లడించారు. రాబోయే సంవత్సర కాలంలో 15 వేల సంఖ్య 40 వేలకు చేరుకుంటోందని స్పష్టం చేశారు.
శేరిలింగంపల్లిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన గూగుల్ క్యాంపస్కు శంకుస్థాపన చేశామని.. కొత్తూరులో లిక్విడ్ డిటర్జెంట్ యూనిట్ను ప్రారంభించామని తెలిపారు కేటీఆర్. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు అన్ని రంగాల్లో బహుముఖంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.