రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం అనేక దేశాలను సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న మారణకాండను నిలిపివేయాలని ప్రపంచ దేశాలు చెప్తున్నాప్పటికీ.. పుతిన్ మాత్రం తగ్గేది లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో రష్యాపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా గెలవకూడదని తాజాగా జీ7 దేశాలు సంయుక్త ప్రకటన రిలీజ్ చేశాయి.
ఈ గ్రూపులో ఉన్న కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలు.. ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించాయి. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా గెలకుండా ఉండేందుకు అనుగుణంగా.. ఉక్రెయిన్ కు మరింత సైనిక, ఆర్థిక సహకారం అందించాలని తీర్మానించినట్టు తెలుస్తోంది.
ఉక్రెయిన్ పైన రష్యా కొనసాగిస్తున్న మారణకాండను నిలిపేసేందుకు.. ఉక్రెయిన్ అండగా తామంతా ఉంటామని జీ7 దేశాలు ప్రకటించాయి. అందుకు సంబంధించి మే 8న అధికారిక ప్రకటనను రిలీజ్ చేశాయి. పుతిన్ సిగ్గుమాలిన చర్యకు దిగారి.. ఆ దేశ ప్రజల చరిత్రాత్మక త్యాగాలను విస్మరించారని మండిపడ్డాయి. అంతర్జాతీయ చట్టాలను పుతిన్ పూర్తిగా ఉల్లంఘించారని జీ7 దేశాలు ఆరోపించాయి.
మరోవైపు సోమవారం రష్యాలో విక్టరీ డే వేడుకలు జరుగుతున్నాయి. మాస్కోలో సైనిక పరేడ్ ఆర్గనైజ్ చేశారు. రెడ్ స్క్వేర్ లో ఈ వేడుకలను నిర్వహించారు. మర్చింగ్ బ్యాండ్ మ్యూజిక్, రకరకాల యూనిఫామ్ సైనికులతో మాస్కో వెలిగిపోయింది. పరేడ్ ను పుతిన్ దగ్గరుండి వీక్షించారు.