పెళ్లి అంటే నూరేళ్ళ పంట. అందుకే ఎంత పేద వారైనా.. ఎంత ధనికులైన తమ తమ స్థాయిలో..ఆ జంటకు జీవితాంతం పెళ్లి గుర్తుకు ఉండిపోయేలా చేస్తారు. దీంతో పెళ్లి ఇంట ఉండే సందడే వేరు. ఇక ఈ సందడే.. ఆనందోత్సాహాల మధ్య కళకళలాడుతున్న ఓ పెళ్లింట పెను విషాదాన్ని నెలకొల్పింది.
పెళ్లి సందర్భంగా పెట్టిన డీజే సౌండ్ తట్టుకోలేక పెళ్లికొడుకు కుప్పకూలాడు. ఈ దుర్ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్ లోని సీతామర్హి జిల్లాలో మణితార గ్రామానికి చెందిన సురేంద్రకుమార్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఇందర్వాలో పెళ్లి జరుగుతోంది.
దంపతులు దండలు మార్చుకున్నారు. సాంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. అనంతరం పెళ్లి ఊరేగింపులో ప్లే అవుతున్న డీజే సౌండ్ ను తగ్గించండంటూ పెళ్లికొడుకు సురేంద్రకుమార్ చాలా సార్లు చెప్పాడు. అయినప్పటికీ అతని మాటను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఒక్కసారిగా వేదికపై సురేంద్రకుమార్ కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే సురేంద్రకుమార్ మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే స్థానిక యంత్రాంగం డీజే పై కఠిన నిషేధం విధించింది. అయినప్పటికీ ఎవరూ కూడా దీనిని పట్టించుకోవడం లేదు. సామాజిక కార్యకర్త డాక్టర్ రాజీవ్ కుమార్ మిశ్రా కూడా డీజేలపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని స్థానికులను కోరారు.