రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని, పేదవాళ్లకు 100 గజాల ఇళ్ల స్థలం ఇచ్చే జీవో మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజా ప్రతినిధులు నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
అలాగే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ సహాయం రెండు లక్షలకు పెంచాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. ఈ స్కీంకు మరో రెండు లక్షలు అదనంగా ఇవ్వాలన్నారు. తద్వారా పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన వాళ్లు అవుతారని, ఇప్పుడు ఇస్తున్న మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని, ప్రభుత్వం ఆ రెండు లక్షలు అదనంగా ఇవ్వడం ద్వారా చాలా ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
అదే విధంగా జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. క్యాన్సర్ రోగుల సమస్యలపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యం కోసం ఆ కుటుంబాలు అప్పుల పాలు అవుతున్నాయన్నారు.
యాదాద్రికి మెట్రో రైల్ ఏర్పాటు చేయాలని, అలాగే సంగారెడ్డి కూడా మెట్రోను విస్తరించాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి 3016 ఇస్తామన్నారు. ఆ అంశం గవర్నర్ ప్రసంగంలో రాలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.