కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేఏ పాల్ దాఖలు చేసిన పిల్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ముసాయిదాను మున్సిపల్ కౌన్సిల్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేసిన కేఏ పాల్..పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించారు. రైతుల అభ్యంతరాలను తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ పై జీవో ఇచ్చారని తన పిల్ లో కేఏ పాల్ పేర్కొన్నారు. అయితే కౌన్సిల్ కు నిర్ణయం తీసుకునే అధికారం లేదని మాస్టర్ ప్లాన్ రద్దు పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని పాల్ కోరారు.
ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు కేఏ పాల్. దీంతో మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిబ్రవరి 13 లోపు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 13 కు వాయిదా వేసింది.
మరో వైపు ఈ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఇదివరకే ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి జనవరి 25న హైకోర్టులో విచారణ జరిగింది. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందని పిటిషన్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్లాన్ రద్దు పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు.