క్యాట్ స్టే ఆధారంగా తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ వ్యవహారంలో.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు,తదనంతర పరిణామాలు సదరు అధికారులకు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
ఏపి కేడర్ కేటాయింపు పై క్యాట్ ఇచ్చిన స్టే ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పువెలువడిన కొద్ది గంటల్లోనే డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తీర్పు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆదేశాలివ్వడం.. డీఓపీటీ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. మిగిలిన అధికారుల విషయంలోనూ.. ఇదే తరహా వైఖరిని అనుసరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగిగితే ఏపీ కేడర్ కు కేటాయింపు జరిగి.. స్టే ఆధారం తెలంగాణలో కొనసాగుతున్న అధికారులకు ఇబ్బందులు తప్పకపోవచ్చని చర్చ జరుగుతోంది.
ఇప్పటికే న్యాయస్థానంలో ఆ అంశం ఉన్న తరుణంలో డీఓపీటీ అదే తరహాలో తన వైఖరిని కోర్టుకు వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. సోమేశ్ కుమార్ కి సంబంధించి ఇచ్చిన తీర్పునే..ఉటంకించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే సదరు అధికారులకు ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నం కావచ్చని అంచనావేస్తున్నారు. ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్..ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్, ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణిప్రసాద్ ,రొనాల్డ్ రోస్, ప్రశాంతి, అమ్రపాలి… ఆ జాబితాలో ఉన్నారు.
ప్రస్తుత పరిణామాలు ఆ అధికారులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అధికారులతో పాటు ప్రభుత్వానికి ఇక్కట్లు తప్పేలా లేవు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కీలకమైన రెవెన్యూ సంబంధిత అన్ని శాఖల బాధ్యతలు చూస్తున్న సీనియర్ అధికారి సోమేశ్ కుమార్ అందుబాటులో లేకుండా పోయారు. మిగిలిన అధికారుల విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తే వారి పరిస్థితి అంతే.. దీంతో సీనియర్ అధికారుల సేవలను కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల ఇన్ చార్జిలు, అదనపు బాధ్యతలతో నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. మరికొంత మంది అధికారుల సేవలు దూరమైతే సర్కార్ కు మరిన్ని ఇక్కట్లు ఎదురుకానున్నాయి.