తెల్లవారితే తమ పాపకు చెవులు కుట్టే కార్యక్రమం ఉండటంతో ఆ కుటుంబం మొత్తం కూడా ఏర్పాట్లలో మునిగిపోయారు. కానీ అనుకొని వార్త వినాల్సి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఎంతో ఉత్సాహంగా స్కూల్ కి వెళ్లిన ఆ చిన్నారి మరణ వార్త విని కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
బాత్ రూం కి వెళ్లడానికి క్లాస్ నుంచి బయటికి వచ్చింది. అప్పుడే పాము కాటేయడంతో హాస్పిటల్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ శివారులోని భట్టుతండాలో బుధవారం జరిగింది. భట్టు మోహన్, పార్వతిలకు ఇద్దరు బిడ్డలు. పెద్ద కూతురు భట్టు మన్విత (6) తండాలోని ప్రైమరీ స్కూల్లో చదువుతున్నది.
బుధవారం ఉదయం స్కూల్కు వెళ్లింది. గురువారం చెవులు కుట్టే ప్రోగ్రాం ఉందని ఫ్రెండ్స్కు చెప్పుకొని మురిసిపోయింది. బాత్రూం వస్తుందని టీచర్కు చెప్పడంతో వెళ్లమన్నాడు. క్లాస్ రూం నుంచి బయటికొచ్చిన మన్విత.. మెట్లు దిగుతుండగా తాచుపాము కాటేసింది. ఈ విషయాన్ని టీచర్కు చెప్పడంతో అతను పేరెంట్స్కు సమాచారం ఇచ్చాడు.
వారు వచ్చి మన్వితను నర్సంపేట హాస్పిటల్కు తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయింది. చెవులు కుట్టే ప్రోగ్రాం ఉండటంతో ఇంటికొచ్చిన బంధువులు మన్విత చనిపోయిందని తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏ పందికొక్కులు బుక్కినయ్..?
వరంగల్ భట్టుతండా ప్రైమరీ పాఠశాలలో పాముకాటుకు గురై బాలిక మృతి చెందిన ఘటన పై బీఎస్పీ రాష్ట్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మన ఊరు, మన బడి పథకం పేరిట కోట్ల రూపాయలు మెఘా-ర్పణం చేసి, పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకున్న ఈ పాపం ఎవరిది అంటూ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘వందల కోట్ల రూపాయలు ఏ పందికొక్కులు బుక్కినయ్..? ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను నిర్వీర్యం చేయడమేనా..? మీ లక్ష్యం’ అంటూ ట్విట్టర్ వేదికగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.