ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. తెల్లవారుతుండగానే టెంపరేచర్ పెరిగిపోతోంది. రోజురోజుకు మారుతున్న వాతావరణ మార్పులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
నేటి నుంచి 4 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నెలలో 122 ఏళ్ల ఉష్ణోగ్రతల రికార్డును ఈ ఏడాది ఎండలు బ్రేక్ చేశాయంటోంది. ఈ నెలలో తొలి 10-15 రోజులు ఎండలు మండిపోయే అవకాశం ఉందని పేర్కొంది.
హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని స్పష్టం చేసింది. ఇలాంటి వాతావరణం వల్ల అడవుల్లో కార్చిచ్చు అంటుకునే అవకాశాలూ ఉన్నాయని అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం తర్వాత 41 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. మండిపోతున్న ఎండలు దశాబ్దాల రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఏకంగా 122 ఏళ్ల తర్వాత దేశంలో గత నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
1901 తర్వాత ఈ మార్చిలో సరాసరి 33.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో 2010లో నమోదైన 33.09 డిగ్రీల రికార్డు చెరిగిపోయింది. ఈ ఎండల ప్రభావం ఏప్రిల్ లోనూ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. బయటకు వెళ్లకుండా ఉండడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.