హిజాబ్ పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముస్లిం విద్యార్థినులను హిజాబ్ తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి కర్ణాటక ప్రభుత్వం అనుమతించలేదనే అంశంపై దాఖలైన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది కర్నాటక హైకోర్ట్. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ముస్లిం మహిళలకే నష్టం జరుగుతోందని.. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ప్రస్తుతానికి హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండని పేర్కొన్నారు.
దేశ పౌరులు అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే మేము ఇక్కడ ఉన్నామని అన్నారు. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటామని హామీ ఇచ్చారు. దీన్ని ఇప్పుడే పెద్దది చేయకండని అన్నారు.
ఇదే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. కర్ణాటక హైకోర్టు తుది ఆదేశాలను ఇవ్వకుండా.. సుప్రీం కోర్టులో ఎలా సవాలు చేస్తారని ప్రశ్నించారు. హైకోర్టును తేల్చనీయండని అన్నారు. ఈ సమస్యను రాజకీయం, మతపరం చేయవద్దని పేర్కొన్నారు.