16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కొత్తగూడెం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పోక్సో కేసులో నిందితుడు అజ్మీరా సాయి కిరణ్ కు 25 ఏళ్ళ కఠిన కారాగార శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కేసుల మొదటి అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.
జరిమానా చెల్లించలేని పక్షంలో 6 నెలల కఠిన కారాగార శిక్ష అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. దుమ్ముగూడెం మండలం తురుబాక గ్రామానికి చెందిన అజ్మీరా సాయి కిరణ్ అనే యువకుడు జూన్ 24, 2018 న 16 నెలల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అప్పటి దుమ్ముగూడెం ఎస్ ఐ బాలకృష్ణ ఈ కేసు నమోదు చేయగా, అప్పటి భద్రాచలం ఏఎస్పీ, ప్రస్తుత టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ విచారణ అధికారిగా ఉన్నారు. ఈ కేసులో చిన్నారి తల్లిదండ్రులతో సహా 12 మంది సాక్షులను విచారించారు. పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్ష ఉన్నప్పటికీ, తెలంగాణలో 25 ఏళ్లు అరుదైనది. ఇతర రాష్ట్రాల్లోనూ పోక్సో చట్టం కింద 25 ఏళ్ల శిక్షలు చాలా తక్కువగా నమోదు కావడం గమనార్హం.