– ఇదంతా టీఆర్ఎస్ దుష్ప్రచారమే
– కార్మికులారా.. టీఆర్ఎస్ మాటలు నమ్మకండి
– సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే
– రాష్ట్ర ఆమోదం లేకుండా ప్రైవేటీకరణ మాటే ఉత్పన్నం కాదు
-కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాసిన లేఖ విడదల చేసిన బండి
సింగరేణి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ నేతలు ఆడే అబద్దాలకు అంతూపొంతు లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ విమర్శంచారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుగా సిగ్గులేకుండా పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పూటకో అబద్దం.. రోజుకో మాట మాట్లాడుతూ.. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. తన జిత్తుల మారి ఎత్తులతో రైతులను, విద్యార్థులను, కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ధాన్యం సేకరణ విషయంలో రైతులను నట్టేట ముంచిన కేసీఆర్.. తాను చేసిన తప్పిదాలను కేంద్రంపై మోపి బద్నాం చేసే కుట్రలను చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు కొంగు బంగారం.. నల్లబంగారంగా నెలవైన సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందంటూ విష ప్రచారానికి తెరదీస్తూ.. సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించాలనే ప్రచారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకే.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశామని బండి స్పష్టం చేశారు. ఆ లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి.. సింగరేణి విషయంలో స్పష్టమైన వివరణ ఇచ్చారని పేర్కొన్నారు.
సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని.. అది అసాధ్యమని మంత్రి తేల్చి చెప్పారని సంజయ్ చెప్పారు. సింగరేణి సంస్థలో అత్యధికంగా 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే.. కేంద్ర వాటా 49 శాతం మాత్రమే ఉటోందనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడం సాధ్యం కాదనేది ప్రజలు గుర్తించాలని తెలిపారు. కోల్ బ్లాక్ వేలం విషయానికి వచ్చినప్పుడు మైన్స్ అండ్ మినరల్ డెవలప్ మెంట్ రెగ్యులేషన్ యాక్ట్-2015 ప్రకారం.. పారదర్శకంగా వేలం వేయాలని చట్టం చేశారని వివరించారు సంజయ్.
ఈ చట్టం ప్రకారం.. యాక్షన్ వేలం ద్వారా.. లేదంటే అలైన్ మెంట్ ద్వారా కేటాయించాలనే నిబంధన ఉందని వివరించారు. ఈ పద్దతి ప్రకారం రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుందని కేంద్ర మంత్రి తెలిపారని అన్నారు. అయితే.. 2020లో కమర్షియల్ మైనింగ్ అనే అంశాన్ని చట్టంలో చేర్చడంవల్ల.. నాటి నుండి వేలం ద్వారా మాత్రమే బొగ్గు బ్లాకులు కేటాయిస్తున్నారని స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతానికి చెందిన 4 బ్లాకులను వేలం వేస్తే ఎవరూ బిడ్లు వేయలేదని.. ఈ బ్లాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే వేలం ద్వారా సింగరేణి సంస్థ పొందవచ్చని ఆయన అన్నారు. ఇప్పటికే సింగరేణి 3 బ్లాకులను ఈ చట్టం ద్వారా పొందిందని.. అందులో ఒడిశా రాష్ట్రంలోని నైనికోల్ బ్లాక్, పెనగడప-తెలంగాణ, నూ పాత్రపర-ఒడిశాను సింగరేణి తీసుకుందని కూడా కేంద్ర మంత్రి తెలిపారని పేర్కొన్నారు.
సింగరేణి ప్రాంత ప్రజలు కానీ కార్మికులు.. సింగరేణిని ప్రైవేటీకరించబోతున్నారని చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఝప్తి చేస్తున్నామని సంజయ్ అన్నారు. సింగరేణికి చెందిన ప్రస్తుతం ఉన్న బొగ్గు గనుల నిక్షేపాలు మరో 100 సంవత్సరాల పైచిలుకు ఉంటాయని తేల్చి చెప్పారు. బీజేపీపై దుష్ప్రచారం చేస్తూ.. లేనిపోని బురదజల్లే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ నేతలు ఈ వాస్తవాలను అర్ధం చేసుకోవాలని మండిపడ్డారు. ఇకనైనా కళ్లు తెరుచుకుని వాస్తవాలు మాట్లాడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు బండి సంజయ్.