భారతీయ వాతావరణ శాఖ అన్నదాతలకు తీపి కబురు చెప్పింది. రానున్న వర్షాకాలంలో భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంచనాలకు మించి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర తెలిపారు.
దీర్ఘకాలం సగటులో 99% మాత్రమే వర్షాలు పడొచ్చని ఏప్రిల్ లో లెక్కలు వేసిని వాతావరణ శాఖ.. రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో.. దీర్ఘకాలం సగటుకు 103 శాతం వర్షాలు కురుస్తాయని తాజాగా వెల్లడించింది.
ఈ మేరకు ప్రస్తుత సీజన్ కు సంబంధించిన అంచనాల గణాంకాలను డైరెక్టర్ జనరల్ విడుదల చేశారు. మధ్య, ద్వికల్ప భారతదేశంలో దీర్ఘకాలంలో సగటుకు 106 శాతం వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని తెలిపారు. సాధారణంగా జూన్ 1న కేరళకు రావాల్సిన రుతుపవనాలు.. మూడు రోజులు ముందుగానే వచ్చినట్లు పేర్కొన్నారు. కేరళలో ఇప్పటికే రుతుపవనాలు ప్రారంభమవగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని స్పష్టం చేశారు. అయితే.. దేశంలోని చాలా వరకు భూభాగాల్లో వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు.