హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని యూనియన్ బ్యాంకు సిబ్బంది నిర్వాకం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. బ్యాంకుకు వచ్చిన వృద్ధుడిని లాకర్ గదిలో ఉంచి తాళం వేసి వెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది.
సుమారు 18 గంటల పాటు ఆ వృద్ధుడు లాకర్ గదిలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో కృష్ణారెడ్డి (87) అనే వృద్ధుడు బ్యాంకుకు వెళ్లారు. లాకర్ గదిలోకి వెళ్లిన వృద్ధుడిని గమనించకుండా సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు.
బ్యాంకుకు పని మీద వెళ్లిన వ్యక్తి చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబీకులు.. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరిగా తాను బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పినట్టు కుటుంబ సభ్యులు చెప్పడంతో ముందుగా ఆ బ్యాంకులోని సీసీ కెమెరాలను పరీక్షించిన పోలీసులు ఖంగుతిన్నారు. లాకర్ గదిలో వృద్ధుడు ఉన్నట్లు గుర్తించారు.
ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్ నుంచి ఆ వృద్ధుడిని పోలీసులు బయటకు తీసుకొచ్చారు. సిబ్బంది నిర్లక్ష్యంపై కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతున్న అతనికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించేవారంటూ మండిపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు పోలీసులు.