వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఆత్మహత్య యత్నం ఘటనకు సంబంధించి డీఎంఈ రమేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. డీఎంఈ రమేష్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రీతి తండ్రి నరేందర్ స్పందించారు. ప్రీతిపై ర్యాగింగ్ జరగలేదని డీఎంఈ చెప్పడం సరికాదని అన్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ర్యాగింగ్ వల్లే తన కూతురు ఆత్మహత్యయత్నం చేసిందని అన్నారు.
ర్యాగింగ్ జరుగుతుందని తన కూతురు చెప్పిందని.. దీనిపై సంబంధిత పోలీసు స్టేషన్కు కూడా తాను సమాచారం ఇచ్చానని చెప్పారు. అందుకు సంబంధించిన మెసేజ్లు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే ప్రీతి స్పృహా కోల్పోయినప్పుడు ఆమె ఫోన్ నుంచే తనకు కాల్ చేశారని.. అయితే ఫోన్ లాక్ ఎలా ఓపెన్ చేశారని ప్రశ్నించారు. స్పెషల్ కేర్ తీసుకుని ప్రీతిని బతికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా వైద్యులు చెబుతున్నారని తెలిపారు.
ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతిని డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి పరామర్శించారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అన్నారు. వెంటిలేటర్పై ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నారని తెలిపారు. పీజీ స్టూడెంట్స్ మధ్య ర్యాగింగ్ ఉండదని చెప్పారు. అండర్ గ్రాడ్యుయేషన్లో ఫస్టియర్, సెకండియర్లో ర్యాగింగ్ ఉంటే ఉండొచ్చని అన్నారు.
డాక్టర్ ప్రీతి విషయంలో ఏ రకమైన వేధింపులు జరిగాయనే విషయమై విచారణ జరుగుతుందన్నారు. విధుల విషయంలో సీనియర్గా తాను మెడికో ప్రీతికి చెప్పానని తమకు సీనియర్ స్టూడెంట్ సైఫ్ నుండి సమాధానం వచ్చిందన్నారు. డాక్టర్ ప్రీతితో పనిచేసే ఇతర మెడికోలను కూడా ఈ విషయమై విచారణ చేస్తే కానీ వాస్తవాలు బయటకు రావని అన్నారు.
ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి రెండు రోజుల ముందే వీరిద్దరికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని రమేష్ రెడ్డి చెప్పారు. ఈ ఘటనపై కమిటీని కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు.