తెలంగాణ వ్యాప్తంగా మరోసారి వర్షాలు జోరందుకున్నాయి. రాజధాని హైదరాబాద్ తో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ నది కూడా ఉప్పొంగుతోంది. కుండపోత వర్షంతో మూసీకి వరద పోటెత్తడంతో మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిల పైనుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ వంతెనలపై నుండి రాకపోకలను నిలిపివేసి ప్రమాదాలు జరక్కుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు మూసీ పరివాహక ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో మునకకు గురయ్యాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందుకులకు గురవుతున్నారు.
అయితే మూసీ నది గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం దాల్చింది. మూసారాంబాగ్ వంతెన పైనుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చాదర్ఘాట్ వంతెనను తాకుతూ వరద ఉధృతి ఉంది. మూసారాంబాగ్, చాదర్ఘాట్ వంతెనలను పోలీసులు మూసివేశారు. దీంతో అంబర్పేట, గోల్నాక మార్గాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని చాలా కాలనీల్లో వరద నీరు ఇళ్లను ముంచెత్తింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. రత్నానగర్, పటేల్ నగర్, గోల్నాకలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల నుంచి సుమారు 3 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. హరేకృష్ణ సంస్థ ద్వారా వీరికి ఆహారం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
వికారాబాద్, చేవెళ్ల, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వరద పోటెత్తింది. దీంతో అధికారులు నిన్న మధ్యాహ్నం నుంచి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి నీటిని వదలుతున్నారు. దీంతో మూసీ నదిలోకి వరద ప్రవాహం పోటెత్తింది.
మూసారాంబాగ్ వంతెన మూసేయడంతో అంబర్పేట్ -మలక్పేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంబర్పేట కొత్త బ్రిడ్జి పైనుంచి వాహనాలు వెళ్తున్నాయి. ఈ రోజు ఆఫీసులు, ఇతర పనుల కోసం వెళ్లే వారు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో అంబర్పేట కొత్త బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరికొన్ని చోట్ల ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తుండటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వర్షం కాస్త తెరిపి ఇవ్వడం ఊరట కల్గిస్తోంది. జంట జలాశయాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం కూడా కాస్త తగ్గినట్లు అధికారులు తెలిపారు.