హైదరాబాద్లో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు నాం పల్లి కోర్టులో హాజరు పరిచారు. సికింద్ర బాద్ లోని గాంధీ ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టు ఎదుట వారిని పోలీసులు హాజరు పరిచారు.
రాష్ట్రంలో వరుస బాంబు పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. భారీ పేలుళ్లతో నగర ప్రజలను భయాందోళనలకు గురిచేయాలని కుట్రలు పన్నిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు
వారి దగ్గర నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లను, దీంతో పాటు రూ.5.50 లక్షల నగదు, మరో ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో అబ్దుల్ జాహెద్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నగరంలో ఉగ్రదాడులను జరిపేందుకు జాహెద్ కు దాయాది పాక్ నుంచి నిధులు అందాయని, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్ కూడా అందాయని పేర్కొన్నారు. నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, బీజేపీ,ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను వారు టార్గెట్ చేసుకున్నట్టు తెలిపారు.
మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లతో కలిసి అబ్దుల్ జాహెద్ గ్రెనేడ్ దాడులకు సంబంధించిన ప్రణాళికలను రచించారని పోలీసులు వివరించారు. అబ్దుల్ జాహెద్ తో పాటు మరో ఏడుగురి పై సిట్ కేసు నమోదు చేసింది. తాజాగా వారిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.