బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసన దీక్షలకు దిగుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ కూడా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆప్ కి వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ దగ్గర బీజేపీ ధర్నాకు దిగింది.
వాస్తవానికి జంతర్మంతర్లోనే ఈ నిరసన చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు సైతం చేసుకుంది. అయితే.. భారత జాగృతి సంస్థ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలంటూ జంతర్మంతర్లోనే మార్చి 10వ తేదీన దీక్ష చేస్తోంది. ముందుగానే అనుమతి కూడా తీసుకుంది.
ఆ తర్వాత బీజేపీకి దీన్ దయాల్ మార్గ్ లో నిరసన దీక్ష చేపట్టేందుకు అవకాశం ఇచ్చారు. ఇటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్మంతర్లో నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో కవిత దీక్ష చేస్తున్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే మహిళా రిజర్వేషన్ల దీక్ష చేపడుతున్నప్పటికీ ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు వేదికగా మారనుంది. ఇప్పటికే 18 పార్టీల ప్రతినిధులు వస్తుండగా…బీఆర్ ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. సీతారం ఏచూరి, డి.రాజా వంటి కీలక నేతలు కూడా వస్తున్నారు. ఇక తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ధర్నాలో పాల్గొననున్నారు.
ఓ పక్క మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్మంతర్లో కవిత నిరాహార దీక్ష.. మరో పక్క లిక్కర్స్కామ్కు వ్యతిరేకంగా దీన్దయాల్ మార్గ్లోని ఆంధ్ర స్కూల్ వద్ద బీజేపీ ఢిల్లీ యూనిట్ చేపడుతోన్న ధర్నాతో.. ఢిల్లీలో హై-వోల్టేజ్ పొలిటికల్ హీట్ కనిపిస్తోంది.