సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య ఘటన పంజాబ్ లో కలకలం రేపుతోంది. సిద్ధూకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందంటూ.. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. 424 మందికి పైగా వీవీఐపీలకు భద్రత పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.
జూన్ 7 నుంచి వీవీఐపీలకు సెక్యూరిటీ అందుబాటు లోకి వస్తుందని పంజాబ్, హర్యానా హైకోర్టుకు ఆప్ ప్రభుత్వం తెలియజేసింది. అయితే.. భద్రత తొలగింపుపై మాజీ మంత్రి ఓపీ సోనీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్ట్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కోర్టుకు చెప్పింది.
వీవీఐపీలకు భద్రత ఎందుకు తొలగించాల్సి వచ్చిందని హైకోర్టు ప్రశ్నించగా.. జూన్ 6న ఆపరేషన్ బ్లూస్టార్ వార్షిక దినం నేపథ్యంలో భద్రతా సిబ్బంది అవసరం ఏర్పడిందని ఆప్ ప్రభుత్వం కోర్టుకు సంజాయిషీ ఇచ్చుకుంది.
కాగా.. వీవీఐపీలకు భద్రత ఉపసంహరించడం.. ఆ మరుసటి రోజే సింగర్ సిద్ధూ దారుణ హత్యకు గురవడంతో ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. భద్రత ఉపసంహరణ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఆప్ ప్రభుత్వం వెనుకడుగు వేయకతప్పలేదనే టాక్ వినిపిస్తోంది.