హనుమాన్ జయంతి విజయ యాత్ర రూట్ మ్యాప్ ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బజరంగ్ దళ్, వీహెచ్పీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ వీరహనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ.. చారిత్రాత్మక గౌలిగూడ రాంమందిర్ నుండి ప్రారంభం కానుంది.
పలువురు పోలీసు అధికారులతో కలిసి.. రాంమందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీపీ.. శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించి పలుసూచనలు చేశారు. మరోవైపు హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ లో ఆంక్షలు విధించారు.
శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్, బార్ షాప్ లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ రూట్ మ్యాప్ ను పరిశీలించడానికి.. గౌలిగూడ నుండి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయానికి ప్రత్యేక బస్సులో పోలీసు అధికారులతో కలిసి తరలివెళ్లారు సీపీ ఆనంద్. ఆయనతో పాటు అడిషనల్ సీపీ చౌహాన్, కార్తికేయ, జాయింట్ సీపీ రమేష్ రెడ్డి, విశ్వ ప్రసాద్, ఏవీ రంగనాథ్, డీసీపీ సతీష్, ఏసీపీ దేవేందర్, సీఐలు రవీందర్ రెడ్డి, సుబ్బిరామి రెడ్డి, భిక్షపతి తదితరులు ఉన్నారు.