దేశ వ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ భ్రష్టుపట్టిందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. గవర్నర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.. ఎవరైనా గౌరవం కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు 7 బిల్లులు ఆపారు గవర్నర్ అంటూ ఆరోపించారు.మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది.. అంటూ ప్రశ్నించారు. ఈ విషయమై గవర్నర్ ఆలోచన చేయాలని సూచించారు.
అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను కూడా ఆపడం ఏంటీ అంటూ మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కేంద్రంపై పోరాటం మొదలైందని చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి. నిజాం పాలనలో కూడా ఎన్నో మంచి పథకాలు పెట్టారని విమర్శించారు. హైదరాబాద్ లో నిజాం ఆఖరి వారసుడి అంత్యక్రియలపై కూడా రాజకీయాలు చేయడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ చెప్పడంలో అర్థం లేదన్నారు. గవర్నర్,ప్రభుత్వ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
అసెంబ్లీని రద్దు చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు పూర్తి కాకుండా అసెంబ్లీ ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దు విషయమై ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయన్నారు.అయితే ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో గవర్నర్ల వ్యవస్థపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి గవర్నర్,రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగాధాన్ని తెరమీదకు తీసుకువచ్చాయి.
మరోవైపు గవర్నర్ తమిళి సై,తెలంగాణ ప్రభుత్వం మధ్య అగాధం కొనసాగుతుంది. దీంతో అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేస్తున్నారు. అయితే అదే స్థాయిలో గవర్నర్ పై మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. గతంలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే కౌశిక్ రెడ్డికి గవర్నర్ ఈ ఫైలును తిప్పి పంపింది. దీంతో మరో కోటాలో కౌశిక్ రెడ్డికి ప్రభుత్వం ఎమ్మెల్సీని కేటాయించింది. ఈ విషయమై అప్పటి నుంచి ప్రభుత్వం ,గవర్నర్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.