-హాత్ సే హాత్ జోడోలో జగడం
-మంటలు రేపుతున్న షబ్బీర్ ఆలీ వ్యాఖ్యలు
-భగ్గుమంటున్న కామారెడ్డి వర్గపోరు
-సుభాష్ రెడ్డి వర్సెస్ మదన్ మోహన్
-రేవంత్ యాత్రకు దూరమైన మదన్ వర్గం
-డైరెక్ట్ గా ఏఐసీసీనే అంటున్న మదన్
కాంగ్రెస్ పార్టీ అనగానే అందరూ కురువృద్ధుల పార్టీగా చెబుతుంటారు. ఇది ఇలా ఉంటే..సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో కొత్త తరం వస్తూనే ఉంటది పాత తరం పోతూనే ఉంటదనే నానుడి ఉంది. కొత్త తరానికి పాత తరానికి బేధాభిప్రాయాలు సహజం అందరం కలిసి మెలసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం అని చెప్పే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్రలో ఉండగానే విభేదాలు బహిర్గతం అయ్యాయి.
గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సాక్షిగా కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లా రెడ్డి నియోజక వర్గాలలో అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యత పై షబ్బీర్ ఆలీ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. రేవంత్ రెడ్డి సభ ప్రారంభానికి ముందే సభాస్థలి వద్ద సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ వర్గీయులు కయ్యానికి సిద్ధమయ్యారు.
అప్పుడే రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజక వర్గానికి సుభాష్ రెడ్డి స్థానంలో జాజుల సురేందర్ కు టికెట్ కేటాయించిన విధానంపై చేసిన వ్యాఖ్యలు కామారెడ్డి కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాలకు ఆజ్యం పోశాయి. దానితో మంగళవారం కామారెడ్డి జిల్లాలోనే సాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్రకు మదన్ మోహన్ వర్గం దూరమయ్యింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే మదన్ మోహన్ కామారెడ్డిలో విలేకరుల సమావేశం నిర్వహించి మాజీ మంత్రి షబ్బీర్ ఆలీని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలను బహిర్గతం చేశాయి.
అయితే కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి షబ్బిర్ ఆలీ ఒక వర్గం, టీపీపీసీ ఐటి సెల్ ఛైర్మెన్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల మదన్ మోహన్ రావులు మరో వర్గంగా గ్రూప్ రాజకీయాలను చేస్తున్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికలలో తక్కువ మెజార్టితో జహీరాబాద్ ఎంపీగా ఓడిన మదన్ మోహన్ రావు ఓడిపోయినప్పటి నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న సుభాష్ రెడ్డి సైతం తనకు టికెట్ వస్తుందని ధీమాతో అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
అయితే మదన్ మోహన్ రావుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ అండ ఉండగా.. సుభాష్ రెడ్డి రేవంత్ రెడ్డి వర్గీయుడిగా షబ్బీర్ ఆలీ మద్దతు ఉంది. గడిచిన ఏడాది ఎల్లారెడ్డిలో రేవంత్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా బహిరంగ సభ సాక్షిగానే ఇద్దరి మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. దానితో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు టీపీసీ ఐటిసెల్ ఛైర్మెన్ గా ఉన్న మదన్ మోహన్ ను సస్పెండ్ చేయడం కలకలం రేపింది. దానిని ఆయన పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు తీసుకెళ్ళారు.
ఇక ఇలా ఉంటే.. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తానని టీపీసీసీ ఐటీ సెల్ ఛైర్మన్ కల్వకుంట్ల మదన్ మోహన్ రావు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ ఆలీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఏడు సార్లు పోటీ చేసి షబ్బీర్ ఆలీ ఒక్కసారే గెలిచారని, పార్టీ పదువుల్లో కనీసం కొడుకును గెలిపించుకోలేడని వ్యాఖ్యానించారు.
వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకే టికెట్ ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు కాదని, పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్ వస్తుందన్నారు. షబ్బీర్ ఆలీ రెండు నియోజక వర్గాల బాధ్యతలు చూస్తానని అనడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేల టికెట్లు ఎంపిక చేసే కార్యక్రమం ఏఐసీసీకి మాత్రమే ఉందని, పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని అన్నారు. ప్రజలు మదన్ మోహన్ ను నాయకునిగా వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటానని వ్యాఖ్యానించారు.