కోతికైనా గీత సక్కగుండాలనే ది పాత సామెత.. కానీ..అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందా..? అని ఎదురు చూడటం ఇప్పటి ట్రెండ్. అదృష్టం అనేది ఎప్పుడు ఎలా తలుపుతడుతుందో ఎవరికి తెలియదు. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా.. మూలన పడి ఉన్న ఒక ఫ్లవర్ వేజ్, ఒక కుటుంబాన్ని కోటీశ్వరుల్ని చేసింది. ఈ ఉదంతం యూకేలో చోటు చేసుకుంది.
యూకేలోని మిడ్ల్యాండ్స్లో ఉంటోన్న ఒక కుటుంబం.. 1980లలో ఒక ప్లవర్ వేజ్ జాడీని కొనుగోలు చేసింది. కొన్నాళ్ళు దీన్ని అలంకరణ వస్తువుగా వినియోగించారు. క్రమంగా పగుళ్లు రావడంతో ఓ మూలన పడేశారు. అలా ఆ ఫ్లవర్ వేజ్ని మూలన పడేసి చాలా సంవత్సరాలే అవుతోంది. అయితే.. అనుకోకుండా ఒక రోజు వాళ్లింటికి ఓ ఆర్కియాలజిస్ట్ వచ్చాడు. అతని దృష్టి ఆ ఫ్లవర్ వేజ్పై పడింది.
కాసేపు దాన్ని పరిశీలించిన ఆ ఆర్కియాలజిస్ట్.. అది చాలా విలువైనదని తెలుసుకున్నాడు. దాని విశిష్టత గురించి ఆ ఫ్యామిలీకి తెలియజేశాడు. 18వ శతాబ్దపు రాజు కియాన్లాంగ్ కాలంలో దీనిని ఉపయోగించేవారని తెలిపాడు. ఈ జాడీతో బంగారం, వెండికి సంబంధించిన పనులు చేసేవారని.. దీనిపై ఉన్న ఎనిమిది అమర చిహ్నాలు ‘దీర్ఘాయువును – శ్రేయస్సును’ సూచిస్తాయని పేర్కొన్నాడు.
ప్రస్తుతం జాడి విలువ కోట్లలో పలుకుతుందని చెప్పాడు. అతని మాటలు విన్న ఆ కుటుంబం షాక్ అయింది. దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియా ద్వారా దాని గురించి తెలుసుకున్న ఓ చైనా ధనవంతుడు.. 1.2 మిలియన్ పౌండ్లకు (రూ.11 కోట్ల 53 లక్షలు) కొనుగోలు చేశాడు. అది తన వారసత్వ సంపద అని, తమ వంశీయులు పోగొట్టుకున్న ఆ వస్తువును తిరిగి పొందినందుకు సంతోషంగా ఉందని కొనుగోలుదారుడు చెప్పాడు.