కలహాలు లేని కాపురాలు ఉండవని పెద్దలు అంటారు. అలాగే, ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగిపోవాలని చెబుతుంటారు. అయితే, కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో భార్యభర్తలు విడాకులు తీసుకుని విడిపోతే కోర్టులు భర్తను భార్యకు భరణం ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తాయి. ఇది సర్వసాధారణం. కానీ, ఓ విడాకులు కేసులు సీన్ రివర్స్ అయ్యింది. భర్త భార్యకు భరణం ఇవ్వటం కాదు భార్యే భర్తకు భరణం ఇవ్వాలి అని సాక్షాత్తు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దిగువ కోర్టు ఈమేరకు ఇచ్చిన తీర్పును సమర్థించింది. తాజాగా ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.
మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్కు చెందిన ఓ జంటకు 1992లో పెళ్లయింది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. ఆ భర్త పెళ్లయిన తర్వాత కూడా భార్యను చదువుకునేందుకు ప్రోత్సహించాడు. చాలా ఖర్చు పెట్టాడు. చివరికి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. అయితే, ఆ భర్తకు ఎలాంటి ఉపాధి లేకుండా పోయింది. ఈ క్రమంలో వారి ఇద్దరి మధ్య కొన్నాళ్లకు కలహాలు రాకడంతో భర్త నుంచి విడాకులు ఇప్పించాలని.. 2015లో భార్య నాందేడ్ సివిల్ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు వారికి అదే ఏడాది విడాకులు మంజూరు చేసింది.
అయితే, తాను విడాకులు కోరలేదని ఈ సందర్భంగా భర్త అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతేకాదు, తన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నందున వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24, 25 ప్రకారం ఆమె నుంచి శాశ్వత భరణం, జీవనాధార ఖర్చులు ఇప్పించాలని పిటిషన్ వేశాడు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా మంచి వేతనం పొందుతోందని, ఆమెకు ఆ ఉద్యోగం రావడానికి తాను ఎంతో కష్టపడ్డానని సదరు భర్త న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు. విడాకులు తీసుకోవడం వల్ల తన జీవితం అస్తవ్యస్తమవుతుందని వాదించాడు. తన భార్యకు నెలకు రూ.30 వేలు వేతనం వస్తోందని, అందులో తనకు సగం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. ఈ వాదనలతో ఏకీభవించిన నాందేడ్ సివిల్ కోర్టు.. భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించింది.
దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి వివాదం పరిష్కరించే వరకు మెయింటెనెన్స్ కోసం నెలకు రూ. 3,000 భర్తకు చెల్లించాలని 2017లో కోర్టు ఆమెను ఆదేశించింది. అలాగే, 2019లో మరోసారి ఇటువంటి ఆదేశాలే జారీచేసింది. నెలకు రూ.5,000 చొప్పున భార్య వేతనం నుంచి కట్ చేసి కోర్టుకు అందజేయాలని ఆమె పనిచేసే స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి సూచించింది.
దీంతో రెండు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమె తరఫు న్యాయవాది.. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్లో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ భారతి దాంగ్రే ధర్మాసనం విచారణ చేపట్టింది. తన భర్తకు ఓ దుకాణం ఉందని, ఆటో రిక్షాను కూడా అద్దెకు ఇస్తున్నాడని భార్య వాదించారు. తమకు ఓ కుమార్తె ఉందని అతడి ఆదాయంలో నుంచి నెలకు రూ.10 వేలు ఇచ్చేలా ఆదేశించాలని కోరింది. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. భర్తకు భార్య భరణం ఇవ్వాల్సిందేనని తీర్పు వెలువరించింది.