బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో దారుణం జరిగింది. అహత్పూర్ గ్రామంలోని మొర్హార్ నది ఒడ్డున ఇసుక తవ్వకంపై పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇసుక గనుల వేలంలో ప్రభుత్వ అధికారులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ.. పోలీసు అధికారులతో ఘర్షణ పడిన గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలు అని కూడా చూడరకుండా చేతులు కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ దారుణ ఘటన మంగళవారం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గయా జిల్లాలోని అధత్ పుర్ గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పిల్లలు, మహిళలను కూడా చూడకుండా చేతులు కట్టేసి దారుణంగా కొట్టారు. ఇసుక మాఫియాతో కలిసి తమను విచక్షణారహితంగా కొట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామానికి దగ్గరగా ఇసుక తవ్వకం జరపొద్దని కోరినందుకు తమపై దాడి చేసినట్టు చెప్తున్నారు.
వర్షాకాలంలో నదీ ప్రవాహం పెరిగినప్పుడు ఇసుకకోతకు గురై గ్రామానికి ప్రమాదం ఉంటుందని శాంతియుతంగా మాట్లాడేందుకు వెళ్లామని.. తాము ఏం మాట్లాడకముందే పోలీసులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగించారని స్థానికులు తెలిపారు. దీంతో భయపడి ఇళ్లకు వెళ్లినప్పటికీ.. పోలీసులు వెంబడించారని ఆరోపించారు.
భయంతో ఇళ్లలో దాక్కున్న వారిని కూడా బయటికిలాగి కొట్టారని అంటున్నారు. అయితే.. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సురేంద్ర యాదవ్.. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.