ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారని తనకు సమాచారం వచ్చిందని ఆయన అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరి కొందరి పేర్లు బయటకు వస్తాయని ఆయన తెలిపారు.
గతంలో కేంద్రాన్ని ఎదిరించి సీనియర్ ఎన్టీఆర్ నిలబడ్డారని, అలాంటి నాయకులు ఇప్పుడు లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నాయకులు, సీఎంలు అందరూ ప్రధాని మోడీకి బానిసలేనని ఆయన ఆరోపించారు.
వారెవరికీ ప్రధాని మోడీని ఎదిరించే ధైర్యం లేదని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ దళిత, బడుగు బలహీన వర్గాల ద్రోహి అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని ఆయన వెల్లడించారు.
అంతర్జాతీయ మీడియా సంస్థలపై ఈడీ, ఐటీ, సీబీఐలను ప్రయోగించడం సరికాదని ఆయన హితవు పలికారు. ఐటీ దాడులతో బీబీసీ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. దేశంలోని మీడియా సంస్థల్లాగా అంతర్జాతీయ మీడియా నోరు మూయించలేరని, వాటిని కొనలేరన్నారు.