భూకంప సహాయక చర్యలపై టర్కీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధ్యక్షుడు ఎర్డోగన్ నేతృత్వంలోని ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. భారీ భూకంపంతో అయినవాళ్లు, తమ నివాసాలను కోల్పోయిన టర్కీ ప్రజలు.. సహాయక బృందాల కొరతతో తమ కుటుంబ సభ్యుల శవాలు శిథిలాల కిందే కుళ్లిపోతున్నాయని వాపోతున్నారు.
అన్ టాకియాలోని 1000 మంది నివసించే 12 అంతస్తుల భవనం కూలిపోగా వాటి శిథిలాల తొలగింపు పనులు ఇప్పటికే కొలిక్కి రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సోమవారం ఓ బాలుడు సహా ఇద్దరు మహిళలను సిబ్బంది రక్షించారు. విపత్తు వచ్చి వారం రోజులు పూర్తవడంతో ఎవరైనా శిథిలాల నుంచి సజీవంగా బయటకు వచ్చే అవకాశాలు అతి స్వల్పమని అధికారులు తెలిపారు.
టర్కీ, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య సోమవారానికి 35 వేలు దాటింది. ఆ మృత దేహాలను ఖననం చేయడానికి ఎక్కడికక్కడ కొత్త శ్మశానాలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. మరో వైపు వేల ఇళ్లు నేలమట్టం కావడంతో తమకు నివాసం లేకుండా పోయిందని బాధితులు నిరాశలో కూరుకుపోయారు. తాత్కాలిక శిబిరాల్లో సామర్థ్యానికి మించి నిరాశ్రయులు ఉంటున్నారు.
ప్రభుత్వం చెప్పినట్లు మరో నగరానికి వెళ్లి బతకడం తన లాంటి పేదవాడికి కుదరదని పోలట్ అనే గ్రామంలోని రైతు వాపోయారు. సిరియా నుంచి వచ్చిన కాందిశీకులు తమకు అందాల్సిన సాయాన్ని , ఆహారాన్ని దోచుకుంటున్నారని టర్కీలోని భూకంప బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి వ్యవస్థకు వారు భాగంగా మారారంటూ ఆక్రోశిస్తున్నారు.