కేసులను విచారించేటప్పుడు న్యాయమూర్తులను విమర్శించడానికి ఓ హద్దు ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. క్రైస్తవ సంస్థలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసును….జడ్జీలు విచారణకు తీసుకోవడం లేదంటూ మీడియాలో వచ్చిన కథనాల గురించి ఆయన మాట్లాడారు.
“నేను కరోనాతో బాధపడుతూ సెలవు తీసుకున్నా. అందువల్ల ఆ కేసు వాయిదా పడింది. కానీ న్యాయమూర్తులు కేసును తీసుకోవడం లేదంటూ మీడియాలో వచ్చిన వార్తలు చూశా. కానీ మమ్మల్ని టార్గెట్ చేయడానికీ ఒక హద్దు ఉండాలి” అని ఆయన అన్నారు.
దేశంలో క్రైస్తవుల మీద దాడులు, హింస పెరిగిపోతున్నాయని వాటిని అడ్డుకోవాలంటూ బెంగళూరు ఆర్చ్బిషప్ డాక్టర్ పీటర్ మచాదో సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈనెల 15న ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది. కానీ ధర్మాసనంలోని న్యాయమూర్తులు లేకపోవడం వల్ల వాయిదా పడింది.
దేశవ్యాప్తంగా ప్రతి నెలా క్రైస్తవ సంస్థలపై సుమారు 45-50 దాడులు జరుగుతున్నాయని సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వేస్ బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై 2018లో వేగవంతమైన విచారణలు, బాధితులకు పరిహారం అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. నేరాల నివారణకు నోడల్ అధికారులను నియమించాలని తెలిపింది. గోహత్య, ద్వేషపూరిత నేరాలను మొగ్గలోనే తుంచివేయాలని కోర్టు పేర్కొంది.