తన మాటలను వక్రీకరించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ మీడియా ముందు మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట మండలం వేదికలో నేను అలా చెప్పలేదన్నారు. రాష్ట్రంలో 80 సీట్లు తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పానని స్పష్టం చేశారు.
మరో 20 సీట్ల కోసం గట్టిగా పనిచేయాలని చెప్పానని.. నేను చెప్పంది కాకుండా దానిని వక్రీకరించారని మంత్రి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు పక్కా అని తెలంగాణ సీఎం కేసీఆర్ చెపుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై క్యాబినెట్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలకు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం వేదిక అయింది.
తెలంగాణలో బీఆర్ఎస్ కు 90 సీట్లు గ్యారెంటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందని, కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉందని సభాముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలలో వ్యతిరేకత ఉన్న 20 మంది ఎమ్మల్యేలను మార్చాలని అన్నారు. నా సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే దీనిపైనే ఆయన మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.