పెద్దలు చెప్పిన 64 కళల్లో చోర కళ ఒకటి. అంటే దొంగతనం కూడా ఒక కళట. దొంగతనం అనేది క్రైమ్ కదా, కళంటారేంటి అని మీకు అనిపించొచ్చు. బిహార్ లో జరిగిన ఓ వింత దొంగతనం గురించి చెబితే చోరీ కూడా నిజంగా కళేనని మీరొప్పుకుంటారు!
సెల్ ఫోన్ ని కొట్టేసే దొంగల్ని గురించి విన్నాం. ఏకంగా సెల్ టవర్నే లేపేసారంట కొంత మంది ఇనప దొంగలు. దీనికి ఎంత టేలెంట్ కావాలి.ఇప్పుడు చెప్పండి !దొంగతనం కూడా ఓ ఆర్టని మీరు ఒప్పుకుంటారు కదా.! పోలీసులు కూడా షాకయ్యే ఈ టవర్ దొంగతనం బిహార్లోని సబ్జీబాగ్ ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే ..పాట్నాలోని సబ్జీబాగ్లో ఓ భవనంపై సెల్ టవర్ను అమర్చింది జీటీఎల్(గుజరాత్ టెలీ లింక్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం.. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి యజమాని వద్దకు వచ్చి జీటీఎల్ సంస్థ ఉద్యోగులమని పరిచయం చేసుకున్నారు.
టవర్ను రిపేర్ చేయాలని చెప్పి ఇంటిపైకి వెళ్లారు. నాలుగు గంటలైనా వారు కిందకు రాకపోవడం వల్ల అనుమానం వచ్చిన ఓనర్ పైకి వెళ్లి చూడగా టవర్ను విడి భాగాలుగా చేసి ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించాడు. వెంటనే కంపెనీ మేనేజర్కు సమాచారం అందించాడు యజమాని.
అనంతరం కంపెనీ మేనేజర్ దొంగలపై స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
అపహరణకు గురైన సెల్ టవర్ను 2006లో ఏర్పాటు చేశామని, ఈ ఘటన నాలుగు నెలల క్రితం జరిగిందని కంపెనీ మేనేజర్ తెలిపారు. ఈ విషయంపై కంపెనీయే అంతర్గతంగా నాలుగు నెలలు విచారణ జరిపిందని వెల్లడించారు. అయితే, తమకు ఎటువంటి ఆచుకీ లభ్యం కాలేదని చెప్పారు.
చివరకు చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది కంపెనీ. సెల్ టవర్ విలువ రూ.8.32 లక్షలు ఉంటుందని సమాచారం. కాగా, పట్నాలో మొబైల్ టవర్ దొంగతనం జరగడం ఇది రెండో సారి. 2022 నవంబర్లో రూ.19 లక్షల విలువైన టవర్ చోరీకి గురయింది. ఇది కూడా జీటీఎల్ కంపెనీదే కావడం గమనార్హం.