కొంతమంది రెస్టారెంట్ కి వెళ్తారు. ప్లేట్ లో పెట్టిన భోజనం పూర్తిగా తింటే నామోషి అన్నట్టుగా కంచంలో కొంత వదిలిపెట్టేస్తారు. ఇది ఒక రెస్టారెంట్ లో ఒక సీట్లో.. ఒక పర్సన్ ప్రదర్శించే హోదా..లేదా అరువు తెచ్చకున్న అజీర్తి, లేదా పదార్థంపై అయిష్టం. కారణం ఏదైనా కావచ్చు కంచంలో అన్నం వదిలి పెట్టడాన్ని ప్రామాణికంగా ప్రయోగిస్తారు.
కొందరు హోటల్లోనే కాదు ఇంట్లో ఉన్నా ఇదే తీరు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు ఓ రెస్టారెంట్ కస్టమర్లకు వింత ఆఫర్ ఇచ్చింది. కేవలం రూ. 60కే అడిగినంత భోజనం పెడతామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
అయితే.. ఒక కండీషన్ పెట్టింది ఆ రెస్టారెంట్ యాజమాన్యం. ఎంత తిన్నా ఫరవాలేదు కానీ ఒక్క మెతుకు వదిలేసినా జరిమానా తప్పదని హెచ్చరించింది. జరిమానా కూడా ఎంతో కాదు కేవలం ఏభై రూపాయలే..!
ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు లేదని చెబుతున్న రెస్టారెంట్.. జరిమానా నిబంధన అందరికీ స్పష్టంగా కనిపించేలా రెస్టారెంట్ గోడలపై అతికించింది. మధ్యప్రదేశ్, ఇండోర్ నగరంలోని కర్నావత్ రెస్టారెంట్ ఈ వినూత్న ఆఫర్ ఇచ్చింది.
ఈ క్రమంలో రెస్టారెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అయితే..రూ. 60కే కావాల్సినంత తినొచ్చన్న ఆఫర్కు జనం ఎగబడతారని రెస్టారెంట్ యాజమాన్యం అంచనా వేసింది.
కొందరు తాము తినగలిగినదానికంటే ఎక్కువ ఆర్డర్ చేసి చివరకు ఆహారాన్ని పారేసి వెళ్లిపోతారని భయపడింది. ఈ సమస్యకు పరిష్కారంగా పుట్టుకొచ్చినదే ఈ జరిమానా ఆలోచన.
ఆహారాన్ని పారేసే అలవాటు మాన్పించే ఉద్దేశంతోనే ఇలా జరిమానాలు విధించేందుకు నిర్ణయించామని రెస్టారెంట్ ఓనర్ అర్వింద్ సింగ్ కర్నావత్ తెలిపారు. రైతులు ఎంతో కష్టపడి ధాన్యాన్ని పండిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
వారి కష్టం వృధా కాకూడదని పేర్కొన్నారు. ఇక రోజుకు రెండు పూటలా తిండి తినలేని పేదలు ఎందరో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి.. ఆహారం ఎంతో విలువైనదన్న స్ఫృహ కలిగి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.