కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు ఆందోళన రూటును మార్చారు. కేవలం కలెక్టర్ ప్రకటన మేరకు ప్రస్తుతానికి కాస్త శాంతించిన బాధిత అన్నదాతల ఐకాస…తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. పార్టీలకు అతీతంగా వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 10న ఆందోళనకు విరామం ఇవ్వాలని ఐకాస తెలిపింది. ఈ నెల 11న మున్సిపాలిటీ వద్ద ధర్నా చేయాలని అన్నదాతలు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో మాస్టర్ ప్లాన్ పై బాధిత అన్నదాతల ఐకాస సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 7 విలీన గ్రామాల రైతులు హాజరయ్యారు. మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే గంప గోవర్థన్, కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రకటనలపై చర్చించారు. ఈ క్రమంలోనే వారు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
49 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు..వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీలకు అతీతంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు రైతులు నిర్ణయించారు. ఈ నెల 10న ఆందోళనకు విరామం ఇవ్వడంతో పాటు 11 న మున్సిపాలిటీ వద్ద ధర్నా చేయనున్నారు. అదే విధంగా శాంతియుతంగా ఆందోళనలు చేయాలని.. అన్నదాతలు వివరించారు.
అయితే కొన్ని రోజుల నుంచి కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా అన్నదాతలు నిరసనలు చేపట్టారు. పారిశ్రామిక ప్రాంతంలో భూములు కలిపారంటూ వారు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో కలెక్టర్ జితేశ్ పాటిల్ మరోసారి వారి సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. బృహత్ ప్రణాళికపై రైతులు అనవసరంగా అపోహ పడుతున్నారని అన్నారు. ఇది ఇంకా ముసాయిదాగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1,026 అభ్యంతరాలు వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఇక అన్నదాతల ఆందోళనలపై కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్ రెడ్డి స్పందించారు. కన్సల్టెన్సీ, డీటీసీపీ చేసిన పొరపాటు వల్లే ఈ గందరగోళం నెలకొందని చెప్పారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయమని తెలిపారు. ఒక్క గుంట భూమి కూడా పోదని వివరించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ,కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే..కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.