సస్పెండ్ అవ్వాలనే ఉద్ధేశ్యంతోనే బీజేపీ నేతలు వెల్ లోకి వెళ్లారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై మంత్రి స్పందించారు. శాసన సభలో తాను బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారనే కారణంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. వెల్లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత బీఏసీలో సీఎం చెప్పారని గుర్తు చేశారు.
వెల్లోకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టారని.. అందుకు సభ ఆమోదించిందని హరీశ్ పేర్కొన్నారు. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారని వివరించారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు పోచారం ప్రకటించారు. దీంతో ఆ ముగ్గురు నేతలు అసెంబ్లీ బయట ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాలే కాబట్టే వారిన సస్పెండ్ చేయలేదని హరీశ్ వివరించారు. తమ స్థానంలో నిలబడి అడిగితేనే రాజ్యసభలో 12 మందిపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఢిల్లీకి ఒక న్యాయం.. రాష్ట్రానికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగం సమయాల్లో వెల్ లోకి రాకూడదని ఆయన చెప్పారు.
ఈ ఆర్థిక ఏడాదిలో 40 వేల కుటుంబాలకు దళితబంధు సాయం అందిస్తామని హరీశ్ వెల్లడించారు. 2022-23 పూర్తయ్యే నాటికి 2 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల కోసం నిధులను బడ్జెట్ లో కేటాయించామని హరీశ్ రావు వివరించారు.