బీఆర్ఎస్ మొదటిసారి రేపు ఖమ్మంలో చేపట్టబోతున్న భారీ బహిరంగ సభ సందడి మొదలైంది. ఈ సభలో పాల్గొనడానికి కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు హైదరాబాద్ రానున్నారు. రేపటి ఖమ్మం సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతన్ పాల్గొననున్నారు.
యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈ రోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరంతా రేపు ఉదయం సీఎం కేసీఆర్ తోకలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి వెళ్లనున్నారు. స్వామివారి దర్శనానంతరం అందరూ ఖమ్మం సభకు బయలుదేరుతారు. మరో వైపు ఖమ్మంలో తొలి బీఆర్ఎస్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు, రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తుమ్మల నాగేశ్వర్ ఇప్పటికే పరిశీలించారు.
బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు. దాంతో 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అంతే కాదు ఈ సమావేశంలో వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులకు మంత్రి మహమూద్ అలీ స్వాగతం చెబుతారు. వారి ప్రోటోకాల్ చూస్తారు. కేరళ సీఎంకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం చెప్తారు.
సీపీఐ జాతీయ నేత డి.రాజుకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ స్వాగతం పలుకుతారు. రేపు ఉదయం ముఖ్యనేతలందరూ సీఎం కేసీఆర్ తో బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. తరువాత దేశ రాజకీయాలపై వారంతా చర్చిస్తారు. ఆ తర్వాత కేసీఆర్ తో కలిసి యాదాద్రికి వెళ్తారు. అక్కడి నుంచి రెండు హెలికాప్టర్లలో ఖమ్మంకు బయలు దేరుతారు. నేరుగా కేసీఆర్ తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్ చేరుకొని రాష్ట్రంలో చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే సభా వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలే ఉంటారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది.