బ్రెజిల్లోని ఓ పాఠశాలలో ఆగంతకుడు జరిపిన కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడిక్కడే మరణించగా.. దాదాపు 11 మంది గాయపడినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో ఇద్దరు టీచర్స్ ఉండగా ఒక విద్యార్థి ఉన్నారు.
ఆగంతకుడు స్కూల్ లోనికి వచ్చే ముందు బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఆగ్నేయ బ్రెజిల్లోని రెండు పాఠశాలలపై దాడి చేసి ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థిని కాల్చి చంపినట్లు ఆ దేశ వార్తా సంస్థలు పలు కథనాలను ప్రచురించాయి. కాగా మరో 11 మంది గాయపడ్డారని కూడా ఆ కథనాలు పేర్కొన్నాయి.
ఎస్పిరిటో శాంటో రాష్ట్రంలోని అరక్రూజ్ నగరం పోలీసు అధికారులు సంఘటన గురించి సమాచారం ఇస్తూ.. శుక్రవారం ఉదయం పాఠశాలలో కాల్పుల ఘటన జరిగిందన్నారు. ఘటనలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు, ఒక విద్యార్థి మృతి చెందగా, 9 మంది గాయపడ్డారని వారు తెలిపారు. షూటర్ వద్ద సెమీ ఆటోమేటిక్ పిస్టల్ ఉందని వారు చెప్పారు.
ఓ స్థానిక రేడియో నెట్వర్క్తో అరక్రూజ్ మేయర్ లూయిస్ కార్లోస్ కౌటిన్హో మాట్లాడుతూ.. నిందితుడు ఒక పాఠశాలలో కాల్పులు జరిపిన తర్వాత మరొక పాఠశాలకు వెళ్లాడని, అక్కడ కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని అన్నారు. కాగా అక్కడ నిందితుడిని పోలీసు అధికారులు అరెస్టు చేసినట్లు రాష్ట్ర గవర్నర్ రెనాటో కాసాగ్రాండే తెలిపారు.
దీనిపై విచారణ జరిపి త్వరలో మరింత సమాచారం సేకరిస్తామని గవర్నర్ ట్వీట్ చేశారు. పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా విచారం వ్యక్తం చేస్తూ, ఇది విషాదమని పేర్కొన్నారు.
ఆయన ట్వీట్ చేస్తూ ‘‘దాడుల గురించి తెలిసి చాలా బాధపడ్డాను. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు గవర్నర్ కాసాగ్రాండేకు నా పూర్తి మద్దతు ఉంది’’ అని రాసుకొచ్చారు.