మధ్యప్రదేశ్ లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. బాలాఘాట్ జిల్లాలోని లోదంగి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో.. ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఒక మహిళ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే.. ఈ ముగ్గురు మావోలపై మొత్తంగా రూ.30లక్షల రివార్డు ఉన్నట్టు తెలిపారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
చనిపోయిన వారిలో డివిజినల్ కమిటీ సభ్యుడు నగేష్పైన రూ.15లక్షల రివార్డు ఉండగా.. ఏరియా కమాండర్ మనోజ్తో పాటు రమే అనే మహిళపై చెరో ఎనిమిది లక్షల క్యాష్ రివార్డు ఉన్నట్లు వివరించారు మంత్రి.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తోన్న ప్రత్యేక దళాలు ఇందులో పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు. అలాంటి ప్రాంతాల్లో బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని హోంమంత్రి స్పష్టం చేశారు.