ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ను ప్రయోగించేందుకు ఇస్రో సైంటిస్టులు రెడీ అయ్యారు. రేపు ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ మూడు ఉపగ్రహాలను మోసుకొని రోదసీలోకి దూసుకెళ్లనుంది. ఈ సిరీస్లో ఇది రెండో ప్రయోగం. గతేడాది ఆగస్టు 7న మొదటిసారిగా పంపిన ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలమవడంతో.. ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా సైంటిస్టులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి ప్రయోగం 13.2 నిమిషాల్లో పూర్తి కానుంది. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు.
సుమారు 34 టన్నుల బరువున్న 120 మీటర్ల పొడవైన ఈ రాకెట్ రేపు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి రిహార్స్ల్స్ను, మధ్యాహ్నం 1 గంటలకు మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఈఓఎస్-07, జానస్-1, అజాదీశాట్-2 అనే మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమే ఈ సారి టార్గెట్.
ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఈ రాకెట్ను ఫైనల్గా టెస్ట్ చేస్తారు. తుది విడత తనిఖీలు తర్వాత ప్రయోగానికి 7 గంటల ముందు కౌంట్డౌన్ను స్టార్ట్ చేస్తారు. అంటే రేపు వేకువజామున 2.18 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభిస్తారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 13 నిమిషాల్లోనే రాకెట్ తొలి ఉపగ్రహం ఈఓఎస్-07ను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత మరో రెండింటిని నిమిషం వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. వీటన్నింటినీ 450 కిలోమీటర్ల ఎత్తులో 15నిమిషాల ప్రయాణంలో భూమి చుట్టూ సర్క్యూలర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక ఎస్ఎస్ఎల్వీ ప్రయోగంతో ప్రారంభమయ్యే ప్రయోగాల పరంపర ఈ ఏడాది షార్లో కొనసాగనుంది.
ఎస్ఎస్ఎల్వీ తక్కువ ఖర్చుతో చిన్న పాటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు తయారు చేశారు. అయితే గతేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ మిషన్ విఫలమైంది. అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS)-2, అజాదిశాట్ కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది. అప్పుడు కూడా 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తయ్యేలా డిజైన్ చేశారు.ఆజాదీశాట్ను భూమికి అతి దగ్గరగా 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు.మొదటి దశ 127.5 సెకన్లలో పూర్తి అవగా.. రెండో దశ 336.9 సెకన్లలో పూర్తైంది. రెండో దశలో 7.7 టన్నుల ఘన ఇంధనం ఉపయోగించారు. మూడో దశలో 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేశారు.ఆ తర్వాత సిగ్నల్ మిస్సైంది. నింగిలోకి ఎగిరిన తర్వాత ఉపగ్రహం నుంచి సంకేతాలు అందలేదు. దీంతో నాలుగో దశ ఫెయిల్ అయింది. ఈ లోటుపాట్లను సరిచేసిన శాస్త్రవేత్తలు రాకెట్ అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సారి ప్రయోగాన్ని సక్సెస్ చేసేలా పట్టుదలగా ఉన్నారు.