కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగానే ఉంటుంది. దేశ, విదేశాల నుంచి వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులతో నిత్యం కిటకిటలాడుతూ శోభాయమానంగా వెలిగిపోతోంది. అయితే.. ఆ రద్దీకి తగ్గట్టుగా రైల్వే స్టేషన్ లో ఇప్పటి వరకు పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలా మాత్రం కనిపించదు.
సుమారు 20 ఏళ్ల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్ ఎలా ఉండేదో.. ఇప్పటి వరకు దాదాపుగా అలాగే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. ఇంకొన్నాళ్లు గడిచిన తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ గుర్తించలేనంతగా మారిపోతోందంటున్నారు అధికారులు. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా మారుస్తున్నట్టు పేర్కొన్నారు.
అందుకు సంబంధించిన డిజైన్లు ఇప్పటికే పూర్తి కాగా.. ఆయా పనులను వేర్వేరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కూడా జరిగందని వెల్లడించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. పనులు కూడా శరవేగంగా జరగనున్నాయని తెలిపారు.
ఈ మేరకు వరల్డ్ క్లాస్ తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్ల ఫొటోలను ట్విట్టర్ లో విడుదల చేశారు. టెండర్లన్నీ పూర్తయ్యాయని.. త్వరలోనే పనులు మొదలు కానున్నాయని తెలిపారు అశ్విని వైష్ణవ్. దీనికి టెండర్లు వేసేందుకు భారీగా బిల్డర్లు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.