– సన్ పరివార్ కేసుపై తొలివెలుగు కథనం
– స్పీడ్ పెంచిన సైబరాబాద్ పోలీసులు
– రూ.14 కోట్ల స్వాహాపై ఈడీకి లేఖ
– గులాబీ నేతల జోక్యంపై నివేదిక
ప్రతీక్షణం ప్రజల పక్షాన నిలబడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ.. అవినీతి నాయకులకు నిద్ర లేకుండా చేస్తోంది తొలివెలుగు. అధికారుల్లోనూ కనువిప్పు కలిగిస్తూ నిజాలను బయటకు తెస్తోంది. తాజాగా సన్ పరివార్ కేసుకు సంబంధించి తొలివెలుగు కథనాలకు పోలీస్ అధికారులు కదిలారు. ఇప్పటిదాకా సైలెంట్ గా అంతా నడిపిన పోలీసులు.. రూ.14 కోట్ల స్వాహాపై ఈడీకి లేఖ రాశారు. కొందరి నేతల జోక్యంపై నివేదిక తయారు చేశారు.
వందల కోట్లు కొట్టేసేందుకు పాట్లు.. గులాబీ రాజ్యంలో దొరికితేనే దొంగలు అంటూ ఈనెల 14న సన్ పరివార్ కేసుకు సంబంధించి తొలివెలుగు ఓ కథనాన్ని రాసింది. ఆ తర్వాతే ఈ కేసుపై స్పీడ్ పెంచారు సైబరాబాద్ పోలీసులు. రాజకీయ నేతల హస్తంపై జిల్లా అధికారుల బృందంతో కోట్ల ఆస్తులను బాధితులకు దక్కేలా చేస్తున్నామని తెలిపారు ఉన్నతాధికారులు. ఈ కేసులో 11 రోజులుగా విచారణ కొనసాగుతోంది. కోట్ల వ్యవహారాన్ని మీడియా ముందుకు రాకుండానే సైలెంట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తొలివెలుగు ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చింది.
ఓ మంత్రి గారి అదేశాలు ఉండటంతోనే పోలీసులు విషయాన్ని లీక్ చేయలేదు. కొద్ది రోజుల క్రితం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పటేల్ గూడ సర్పంచ్ నితీష ఇంట్లో తనిఖీలు జరిగాయి. సైబరాబాద్ కమిషనరేట్ లో వ్యక్తిగత దర్యాప్తు కొనసాగింది. సోదాల్లో రూ.16 కోట్లు దొరికినట్లు సమాచారం. వాటితో పాటు నగలు, పలు పత్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సర్పంచ్ భర్త శ్రీకాంత్, అతని మామ, అమీన్ పూర్ ఎంపీపీ దేవానంద్ ని విచారించారు సైబరాబాద్ పోలీసులు.
2018లో కలిస్తే గెలుస్తాం అంటూ.. మనీ సర్క్యులేషన్ ద్వారా అధిక వడ్డీ ఆశ చూపించి బడా మోసానికి పాల్పడ్డాడు మెతుకు రవీందర్. ప్రభుత్వ టీచర్ అయి ఉండి.. తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కోరికతో.. అధిక వడ్డీలు ఆశ చూపించి.. ప్రజల దగ్గర నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేశాడు. శామీర్ పేటలో కేసు నమోదైంది. దీంతో.. రవీందర్ నిర్వహిస్తున్న సన్ పరివార్ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవహారాలు అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. ఆస్తులయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. బాధితులకు డబ్బులు సెటిల్ మెంట్ చేసినట్లు తెలుస్తోంది. అప్పుడే గులాబీ నేతల ఎంట్రీ మొదలైంది.
హత్నూర మండలం ప్రజాప్రతినిధి, పటేల్ గూడ సర్పంచ్ నితీషకు సమీప బంధువు. వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. నితీష తండ్రికి ఓ గులాబీ నేత రూ.16 కోట్లు ఇచ్చాడు. వాటిని ఆయన ఇతరత్రా పెట్టుబడులు పెట్టాడు. ఈ డబ్బు పఠాన్ చెరుకు చెందిన గులాబీ లీడర్ ది. ఆ నగదుతో పాత స్కాం సెటిల్ మెంట్ చేసుకుంటే వందల కోట్లు రావొచ్చని ఆశ పడ్డారు. కానీ.. సర్పంచ్ తండ్రి డబ్బులను మరో విధంగా వాడుకోవడంతో సమస్య మొదలైంది. దీనిపై అమీన్ పూర్ ఎంపీపీ దేవానంద్ మధ్యవర్తిత్వం వహించారు. తర్వాత ఆ ప్రజా ప్రతినిధి అందరినీ ఏకిపడేశారు. ఇష్యూ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. మాదాపూర్ డీసీపీ ఆఫీస్ లో ప్రాథమిక దర్యాప్తు చేసి నిందితుల జాబితాలో నితీష తండ్రి, అన్నల పేర్లు నమోదు చేశారు.
ఈ కేసు విషయం పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. అమీన్ పూర్ లోని ఓ బిల్డర్ ఈ కేసుకు సంబంధించి చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. పాత స్కాంని అడ్డుపెట్టుకొని సంపాదించాలనుకుంటున్న గులాబీ నేతల కోసమే నిందితులను రిమాండ్ చేయకుండా చిత్రహింసలు పెడుతున్నారని సర్పంచ్ బంధువులు ఆరోపించారు. అయితే ఈ కేసులో నితీష తండ్రి, అన్న, ఎంపీపీ దేవానంద్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.