ఇప్పటికే పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపి ప్రభుత్వం ఎస్ఐ పోస్టుల భర్తీకి పూనుకుంది. సివిల్,ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సివిల్,ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులున్నాయి.
సివిల్,ఏపీఎస్పీ ఆర్ ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19 న అనగా రేపు నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఆదివారం జరగనున్న ప్రాథమిక రాత పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 291 కేంద్రాలు సిద్ధం చేశారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటలకు నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షా కేంద్రంలోకి ఎంట్రీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా మొబైల్,ట్యాబ్, ల్యాప్ టాప్,పెన్ డ్రైవ్,బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, పర్సు,నోట్సు,ఛార్టులు,పేపర్లు, రికార్డింగ్ పరికరాలు లాంటివి ఏవైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించరు.
వాటిని అసలు పరీక్ష కేంద్రాల వద్దకే తీసుకురావద్దని,భద్రపరచడానికి ఎలాంటి అదనపు ఏర్పాట్లు ఉండబోవని పోలీసు నియామక మండలి ఇప్పటికే ప్రకటించింది. ఎగ్జామ్ సెంటర్ విషయంలో గందరగోళం పరిస్థితి ఉండకుండా.. అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు. మరో వైపు పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని రావాలని స్పష్టం చేశారు.