సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పుట్టిన గడ్డ ఇది అని పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సర్దార్ సర్వాయి పాపన్న ఏలిన గడ్డ ఇది అని కొనియాడారు. స్టేషన్ ఘనపూర్ లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని తెలిపారు. లెక్చరర్ గా పనిచేసి విద్య విలువ తెలిసిన కడియం శ్రీహరి.. స్టేషన్ ఘనపూర్ కు డిగ్రీ కాలేజీ తేలేకపోయారని ఎద్దేవా చేశారు. గతంలో కడియం కొంచెం పరువుగా బతికారు. దొరగడీలో చేరాక చచ్చిన పాము కంటే హీనంగా బానిసగా బతుకుతున్నారని దుయ్యబట్టారు. రాజయ్య పంచెకట్టు కాంగ్రెస్ లో చెల్లింది కానీ.. దొర గడీలో చెల్లలేదని సెటైర్లు వేశారు.
ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య బర్తరఫ్.. తెలంగాణ చరిత్రలో ఒక మాయని మచ్చ అన్నారు. దళితులంటే చిన్నచూపు ఉన్న కేసీఆర్.. అవినీతి ఆరోపణల పేరుతో ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారన్నారు. రాజయ్య నిజంగా అవినీతి చేసి ఉంటే ఎందుకు బయటపెట్టలేదు? అని ప్రశ్నించారు. రాజయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు.
గాడిదకంటే హీనంగా దొరగారి దొడ్లో ఆయనకు అవమానం జరిగిందన్నారు. గతంలో వరంగల్ కు వైద్య విధాన పరిషత్ తెస్తా అని ప్రకటించిన రాజయ్య.. సొంత నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి తేలేకపోయాడన్నారు. కడియంతో పోలిస్తే కోవర్టు దయాకరరావుకు ఓనమాలు కూడా రావన్నారు. ఒకప్పుడు ఆత్మగౌరవంతో బతికిన కడియం శ్రీహరికి ఇంత అవమానం అవసరమా? మాదిగ బిడ్డల పౌరుషం కడియంలో చచ్చిపోయిందా?, పదవుల కోసం తాకట్టు పెట్టారా? అని నిలదీశారు.
ఒక్క మాదిగ సోదరుడిని కూడా కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా? అని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో ఉన్నప్పుడు రబ్బరు చెప్పులు లేనివాళ్లు ఇవాళ వేల కోట్లకు పడగలెత్తారన్నారు. దొరల గడీలు బద్దలు కొట్టాల్సిన రోజులు మళ్లీ వచ్చాయన్నారు. నోటిఫికేషన్లు లేక ఉద్యోగం రాక నిరుద్యోగుల కష్టాలు అన్నీ ఇన్ని కావంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ప్రజలకు పలు హామీలను ఇచ్చారు రేవంత్ రెడ్డి. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు సాయం అందిస్తామన్నారు. రైతన్నలకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రుల్లో చికిత్సకు రూ.5లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందంటూ తెలిపారు. రైతులకు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించే బాధ్యత కాంగ్రెస్ ది అంటూ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.