‘హాథ్ సే హాథ్’ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని భీమ్ గల్ లోని లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చారిత్రక లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు.
నరసింహస్వామి సాక్షిగా నేను ప్రశ్నిస్తున్నా.. తెలంగాణ వచ్చినా ఇక్కడి రైతులను ప్రభుత్వం ఆదుకుందా అని అడిగారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి.. కానీ తెలంగాణలో నిరుద్యోగుల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రాంత రైతులను బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆదుకోలేదన్నారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి పత్తా లేకుండా పోయారని దుయ్యబట్టారు. 100 రోజుల్లో చెరుకు పరిశ్రమ తెస్తానని చెప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుడి భుజం అని చెప్పుకునే మంత్రి ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా.. ఈ ప్రాంతంలో చెరుకు పరిశ్రమను ఎందుకు మూసివేశారు? ఎందుకు ఇక్కడి రైతులను ఆదుకోవడం లేదు? అని నిలదీశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం లేదా.. చైతన్యం కలిగిన రైతులు ఒక్కసారి ఆలోచన చేయండని కోరారు.
తెలంగాణ వచ్చినా ప్రజల కష్టాలు తీరలేదన్న రేవంత్.. పోరాటంలో, పట్టుదలలో, పౌరుషంలో నిజామాబాద్ రైతులు.. హర్యానా రైతులకు తక్కువేం కాదన్నారు. సుదర్శన్ రెడ్డి, మండవ లాంటి గొప్ప నాయకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండి ఈ ప్రాంతం గౌరవాన్ని పెంచారు. కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ జిల్లా పరువు తీస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.